బీహార్లో రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బెట్టియా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధి మాన్సా తోలా రాయల్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. నర్కటియాగంజ్ - ముజఫర్పూర్ రైల్వే సెక్షన్లో ముగ్గురు యువకులు రైలు ట్రాక్పై కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతున్నారు. అదే క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మరణించారు. అయితే ట్రైన్ వస్తున్న సమయంలో ఆ యువకులు చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన యువకుల్లో రైల్వే గుమ్టిమన్షా తోలా నివాసి మహ్మద్ అలీ కుమారుడు ఫుర్కాన్ అలీ, మన్షా తోలా గ్రామానికి చెందిన మహ్మద్ తుంటున్ కుమారుడు సమీర్ ఆలం, మూడవ వ్యక్తి హబీబుల్లా ఆలంగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ దీప్, రైల్వే పోలీసులు ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి బాధితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులు మొబైల్లో గేమ్లు ఆడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రైల్వే ట్రాక్పై కూర్చొని ఫోన్లు చూస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని ఎస్డీపీఓ వివేక్ దీప్ తెలిపారు.
0 Comments