ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు చెందిన అనూప్ కుమార్ ఉద్యోగరీత్యా భార్యపిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. అనూప్ భార్య రాఖీ గృహిణి. వీరికి అనుప్రియ (5), ప్రియాన్ష్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూప్ ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. సంతోషంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సోమవారం ఉదయం పనిమనిషి వచ్చి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దాంతో ఆమె ఇరుగుపొరుగుకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల అనూప్, అతని భార్య రాఖీతోపాటు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. పిల్లలిద్దరి మృతదేహాలు బెడ్పై పడివుండగా, అనూప్, రాఖీల మృతదేహాలు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాయి. దాన్నిబట్టి అనూప్ దంపతులు ముందుగా పిల్లలిద్దరికి విషమిచ్చి చంపి, తర్వాత వాళ్లు ఉరేసుకున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై పనిమనిషిని ఆరా తీయగా ఆమె పలు విషయాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. పనిమనిషి తెలిపిన వివరాల ప్రకారం అనూప్ ఇంట్లో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వంట మనుషులు కాగా, ఒకరు పిల్లల కేర్టేకర్గా పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఆర్థికంగా వారికి ఏ లోటూ లేదు. అయితే అనుప్రియ ఆరోగ్యం గురించి అనూప్ దంపతులు ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం అనూప్ దంపతులు పుదుచ్చేరి పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు ఆదివారం రాత్రి లగేజ్ను కూడా సర్దిపెట్టుకున్నారు. సోమవారం ఉదయం వారు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ తీరా పనిమనిషి వచ్చి చూసేసరికి వారు పిల్లలను చంపేసి ఉసురు తీసుకున్నారు. పనిమనిషి వెల్లడించిన వివరాలను బట్టి తమ కూతురు అనారోగ్య సమస్య కారణంగానే దంపతులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
0 Comments