తమ ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా పేర్కొంది. వర్క్స్టేషన్లలో కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. కాంగ్రెస్కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను వాడుకొని హ్యాకర్లు వర్క్స్టేషన్లు, కీలకమైన దస్త్రాలను యాక్సెస్ చేయగలిగారు. డిసెంబర్ 8న బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని ట్రెజరీ విభాగం అధికారి తెలిపారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీనిపై ఎఫ్బీఐ అధికారులు స్పందించలేదు. వాషింగ్టన్లోని బీజింగ్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. 'మాపై అమెరికా చేస్తున్న నిరాధార ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాం' అని పేర్కొంది. మరోవైపు జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై స్పందించలేదు. అయితే, వారి వెబ్సైట్లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. 'బియాండ్ ట్రస్ట్ వివరించిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్ ఘటనకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉంటుంది ' అని సైబర్ సెక్యూరిటీ కంపెనీ అధికారి పేర్కొన్నారు.
0 Comments