
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను గత ఐదేళ్లలో చిందర వందర చేశారని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్యే ఉంటానని, అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ''దశాబ్దన్నర కాలంగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు వచ్చింది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప అవకాశమవుతుంది. కరిగిపోయిన ప్రతి సెకను తిరిగి రాదు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవడం లేదు. మేం కూడా నేర్చుకోవడానికి సమయంపడుతోంది. సమస్యలకు పరిష్కారాలు వెతికేలోపు వంద పిటిషన్లు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. చాలా మంది తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించి వస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వీటన్నింటినీ సమన్వయ పరిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకు స్ఫూర్తినింపే నాయకులు కావాలి. అప్పుడు స్వచ్ఛమైన, బాధ్యతయుతమైన ప్రభుత్వం ఇవ్వగలం. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. రాష్ట్రంలో 70శాతం మంది పంచాయతీల్లోనే ఉన్నారు. ఆ శాఖ నాకొక వరం. ఇది వరకూ కార్యకర్తలు, వారి సమస్యల కోసం వెళ్లాను. ఇప్పుడు ప్రజా సమస్యల కోసం వెళ్తున్నా. పనిచేస్తున్న అధికారులపై దాడులు జరుగుతుంటే వెళ్లాల్సి వచ్చింది. స్థానిక నాయకుల నిర్లక్ష్యం కూడా కనపడుతోంది. దాన్ని బద్దలు కొట్టడానికి కడపకు వెళ్లాను. అభివృద్ధికి ఎవరు అడ్డు పడినా ఊరుకునేది లేదనే సందేశం ఇవ్వాలనుకున్నా, ఏజెన్సీ ప్రాంతాల్లో నేను చెప్పులు వేసుకుని నడుస్తుంటే, బురదలో ఇరుక్కుపోయాయి. తర్వాత వదిలేసి నడిచాను. ఈ అనుభవం ప్రతి నాయకుడికి అవసరం. నేను నడిచి చూపిస్తేనే ఇతరులకు ధైర్యం వస్తుంది. నా పేషీతో వెళ్లి జిల్లాల్లో కూర్చోవడం అవసరం. నేనేదో పనిమీద వెళ్లినప్పుడు చూడటం కాకుండా, అక్కడే క్యాంపు ఆఫీస్ పెడితే ప్రజల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపగలం. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అయితే, ఒక జిల్లానా? లేక రెండా? అనేది చూడాలి. సెక్యురిటీ, బస, ఆహార వసతులను కూడా చూసుకోవాలి. అధికార వ్యవస్థలో స్పందన అనేది కరవైంది. ఇటీవల కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారు. అందులో ఒకబ్బాయి బ్రెయిన్ డెడ్ అయితే, అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. వారు కోరుకున్నది ఏంటంటే, సింపుల్ సారీ. ఎవరు చేశారో కనుక్కోమని కోరుతూ కేసు ఫైల్ చేయమన్నారు. పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. నా దృష్టికి రాగానే ఎస్పీతో మాట్లాడమని చెప్పా. నా పేషీలో ఉన్న అధికారులు మాట్లాడితే 'ఇవన్నీ జరుగుతుంటాయండీ.. పోలీసులంతే' అన్నారట. అలా ఎలా మాట్లాడతారు? మానవతా దృక్పథం లేకపోతే ఎందుకు? ఇలాంటి విషయాల్లో సమూల మార్పు తీసుకురావాలి''
''కొన్ని సమస్యల పరిష్కారం కోసం సీఎంగారు 14 గంటల పాటు అధికారులతో మీటింగ్ పెడతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సక్రమంగా పనిచేయాలి. నాణ్యమైన పని చేసినప్పుడు సెలవులు కూడా తీసుకోవచ్చు. అధికార వ్యవస్థలో సమయపాలన సరిగా లేదు. అద్భుతంగా పనిచేయాలంటే 8గంటలు చేసినా చాలు. గత ఐదేళ్లలో ఏపీలో అధికార వ్యవస్థ పనితీరు అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని ఇటీవల దిల్లీలో చెప్పారు. వర్క్ కల్చర్ తగ్గించేశారు. గత ఐదేళ్లలో నాణ్యత పరిశీలన లేకపోవడంతో ఇప్పుడది అలవాటు అయిపోయింది. ఆ అలవాటును మాన్పించడానికి మాకు సమయం పడుతుంది. ఈ క్రమంలో అధికారులు కొంత ఇబ్బంది పడొచ్చు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకోవాలంటే, మిగిలిన రోజులు బాగా పనిచేయాలి. ఐదు రోజులు బలంగా పనిచేస్తే, సెలవు కూడా బాగుంటుంది. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడమే జిల్లాల పర్యటన ఉద్దేశం. అధికార వ్యవస్థను చిందర వందర చేశారు. 'తప్పు జరుగుతుంటే మీరెందుకు ప్రశ్నించలేదు' అని మేము అడుగుతుంటే, ఎవరూ నోరు మెదపడం లేదు. భయపడుతున్నారు. 'అధికారులం కదా మేమేం చేస్తాం' అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమని తాము సమీక్షించుకోవాలి. మా ఆర్నెల్ల పాలన, వాళ్ల తొలి ఆర్నెల పాలన పోల్చండి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని నలిపేశారు. వర్క్ కల్చర్ చంపేశారు. ప్రజల అంచనాలు చూస్తే భారీగా ఉన్నాయి. ప్రతి నెల జీతాలు, పెన్షన్లు సమయానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సివిల్ సప్లయ్లో కుంభకోణాలు బయటపెట్టాం. గత ఐదేళ్లలో లంచాల లేకుండా బదిలీలు జరగలేదు. మేము అధికారం చేపట్టిన తర్వాత మెరిట్ ఆధారంగా పోస్టులు ఇచ్చాం. కొంతమంది లిస్ట్లో తమ పేర్లు చూసుకుని ఆశ్చర్యపోయారు. పేరు తప్పు పడిందేమోనని అనుకున్నారు. నా పరిధిలో ఉండే అధికారులను చాలా స్పష్టతతో కేవలం మెరిట్ ఆధారంగా నియమించాం. దీన్ని కింది స్థాయి వరకూ తీసుకెళ్లాలి. 'ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచామో. మీ కింది వారినీ అలాగే తీసుకోండి' అని చెప్పాను. లంచాలు లేకుండా చూడాలని సూచించా. అవినీతి, లంచగొండితనం చాలా మందిలో జీర్ణించుకుపోయాయి. వీటిని ఎలాగైనా నిర్మూలించాలి'' అని పవన్కల్యాణ్ అన్నారు.
0 Comments