Ad Code

అమరావతిలో 'ఈగల్‌ ' కేంద్ర కార్యాలయం !


ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణ కోసం 'ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌' (ఈగల్‌)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో నార్కోటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్‌ సెల్స్ ఏర్పాటు కానున్నట్టు హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కోంది. గంజాయి, డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్‌ కార్యాచరణ చేపట్టనుంది. ఈగల్ టాస్క్ ఫోర్స్‌లో పనిచేసే సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈగల్ ఫోర్స్‌లో చేరిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులకు 30 శాతం ప్రత్యేక అలవెన్సు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఏపీ హైకోర్టుకు నివేదించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈగల్ ఫోర్స్‌కు ముందుగా రూ.8.59 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu