ఆంధ్రప్రదేశ్ లో రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరగనుందని, ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, 75 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయన్నారు. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ మూడు నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు సమస్యలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు 15 రోజుల్లో పర్యావరణ అనుమతులు సాధించాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దాదాపు రూ.18 వేల కోట్లతో పనులన్నీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరగనుందన్నారు. ఎకో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ మారనుందని తెలిపారు. ఆక్వా, హార్టికల్చర్ ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ''ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారు. మమ్మల్ని నిందిస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే జగన్ను విమర్శించకూడదని షరతు పెట్టారు. ఇలాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గనిపిస్తోంది. వైకాపాలో ఉన్నామని చెప్పుకొనేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం దాచిపెట్టిన చీకటి జీవోలపై విచారణ జరిపిస్తాం. చీకటి జీవోల్లోని అక్రమాలు నిగ్గుతేల్చి గత తప్పిదాలు సరిదిద్దుతాం'' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
0 Comments