సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిభౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వసంత్కుంజ్లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు. రేపు ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీవర్గాల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో భౌతికయాన్ని ఉంచనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు భౌతిక కాయాన్ని మళ్లీ ఎయిమ్స్కు తరలిస్తారు. అంత్యక్రియలు లేకుండా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ పరిశోధనలకు అప్పగించాలని గతంలో పార్టీ నేతలకు సీతారాం ఏచూరి చెప్పారు. ఆయన కోరిక మేరకు ఏచూరి పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. కాగా అనారోగ్యంతో సీతారాం ఏచూరి (72) గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత నెల 19న ఆయన న్యుమోనియాతో బాధపడుతూ.. ఎయిమ్స్లో చేరారు. ఛాతీభాగంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఏచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్ పోర్టల్ 'ద వైర్'కు ఎడిటర్గా సేవలందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఒక కుమారుడు ఆశిష్ 2021లో కొవిడ్తో చనిపోయారు. కుమార్తె అఖిల ప్రస్తుతం ఎడింబరో విశ్వవిద్యాలయం, సెయింట్ ఆండ్రూస్ వర్సిటీల్లో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు.
0 Comments