తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి, రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. గోవి చెళియన్, ఎస్ఎం నాజర్, ఆర్.రాజేంద్రన్ లు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సెంథిల్ కు విద్యుత్, ఎక్సైజ్ శాఖ, చెళియన్ కు విద్యాశాఖ, నాజర్ కు మైనార్టీ వ్యవహారాలు, రాజేంద్రన్ కు పర్యటక శాఖలను కేటాయించారు. పునర్వ్యవస్థీకరణ సాధారణమైనదే అయినప్పటికీ ఈసారి ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మళ్లీ ప్రమాణం చేయలేదు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఉపముఖ్యమంత్రి అనేది తనకు పదవి కాదని, ఓ పెద్ద బాధ్యతని అన్నారు. మరోవైపు ఉదయనిధికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
0 Comments