విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటోపైలట్ బృందంలో భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టీమ్లో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. కృత్రిమ మేధ, ఆటోపైలట్ సాఫ్ట్వేర్లో టెస్లా సాధించిన విజయంపై అశోక్, అతని బృందానికి మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ను కొనియాడుతూ అశోక్ ఎల్లుస్వామి ''ఎక్స్'' వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. '' టెస్లాలో ఏఐ, ఆటోపైలట్ విభాగంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రయోగం మొదలుపెట్టే సమయంలో మస్క్ ఆలోచనలు ఆసాధ్యమని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన నమ్మకం ఉంచి బృందాన్ని ముందుకు నడిపించారు. 2014లో ఆటోపైలట్ను ఓ చిన్న కంప్యూటర్తో ప్రారంభించాం. అది కేవలం 384కేబీ మెమోరీ సామర్థ్యం ఉన్న చిన్న డెస్క్టాప్. లేన్ కీపింగ్, లేన్ ఛార్జింగ్.. వంటివి అమలు చేయాలని ఇంజినీరింగ్ బృందానికి మస్క్ సూచించినా ఎవరూ ఆయన మాటల్ని విశ్వసించలేదు. అయినా.. ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా తన లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. అలా 2015లో మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్ను తీసుకొచ్చారు'' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ''ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెస్లాను అగ్రగామిగా నిలిపారు. మస్క్ దూరదృష్టి సాటిలేనిది. భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటిక్ కార్లు, హోమ్ రోబోట్స్ భాగమవుతాయి '' అని అశోక్ ట్వీట్ చేశారు. దీనిపై టెస్లా అధినేత స్పందించారు. ''టెస్లా ఏఐ, ఆటోపైలట్ బృందంలో మొదటి వ్యక్తిగా వచ్చారు. ప్రస్తుతం అన్ని ఏఐ, ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఈ బృంద సభ్యులు లేకుంటే టెస్లా కూడా సాధారణ కార్ల కంపెనీగా ఉండేదేమో'' అని మస్క్ ప్రశంసించారు.
0 Comments