ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. 'ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదు. బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవు. హేమంత్కు బెయిల్ మంజూరు చేస్తున్నాం' అని కోర్టు పేర్కొంది. ల్యాండ్ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఇదే ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన్ని బిర్సాముండా జైల్లో ఉంచారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేయగా, తదుపరి సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణం చేశారు. రాంచీలో దాదాపు 9 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో సోరెన్ అరెస్టయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫేక్ రికార్డులు, లావాదేవీలు, ఫేక్ డాక్యుమెంట్లతో కోట్ల విలువైన భూమిని అక్రమంగా పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో బెయిల్ కోసం సోరెన్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించడానికి బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో ఆయన ఇంటికి జేఎంఎం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో తనను మోసపూరితంగా ఇరికించారని, అక్రమ కేసులో తాను ఐదు నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సోరెన్కు బెయిల్ రావడంపై ఆయన భార్య కల్పనా సోరెన్ ఆనందం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
0 Comments