టాటా స్టీల్ 2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. యూకే కార్యకలాపాల నుంచి ఈ మేరకు సిబ్బందిని తీసివేయనున్నట్లు తెలిపింది. అక్కడి తయారీ విధానంలో సమూల మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఇది తప్పడం లేదని పేర్కొంది. ఉద్యోగాల కోతలను అక్కడి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ. ఏటా దాదాపు మూడు మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేస్తోంది. 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కర్బన ఉద్గార రహిత ప్రణాళికల్లో భాగంగా తయారీలో బ్లాస్ట్ ఫర్నేస్కు బదులు 'ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్' ప్రక్రియకు బదిలీ అవుతోంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగటంతో పాటు ఉద్గారాలూ గణనీయంగా తగ్గుతాయని సీఈఓ నరేంద్రన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 2,500 ఉద్యోగాల కోతలు తప్పడం లేదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో కర్బన ఆధారిత తయారీని యూకేలో పూర్తిగా నిలిపివేయాలని టాటా స్టీల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.
0 Comments