హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో నకిలీ కరెన్సీని తయారు చేసి చలామణి చేస్తున్న ఓ అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రిక్స్ నేర్చుకుని మరీ ఫేక్ నోట్లు ముద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ కరెన్సీ ప్రింట్ విధానాన్ని పరిశీలించిన నిందితులు, సొంతంగా ఇంట్లోనే ఫేక్ నోట్లు తయారు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు తనిఖీల్లో భాగంగా నిందితుల నుంచి మార్కెట్లో ఎక్కువగా చెలామణి అయ్యే రూ.500, రూ.200, రూ.100 విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.2.91 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఈ నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మద్యం దుకాణాలు, పాన్ డబ్బాలు, రద్దీ తక్కువగా ఉండే చిన్న వ్యాపార కేంద్రాల వద్ద వీటిని ఇచ్చి అసలు డబ్బులను కాజేస్తున్నట్లుగా వెల్లడైంది. నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన కలర్ ప్రింటర్, ఇంక్ డబ్బాలు, ప్రత్యేక కరెన్సీ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
0 Comments