ఇంధన భద్రత పేరుతో దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)ను తప్పనిసరి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వాహనదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ20 పెట్రోల్ పోసిన వాహనాల మైలేజీ తగ్గిపోవడం, ఇంజన్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు పునరాలోచన చేస్తున్నారు. దీని ప్రభావం పెట్రోల్ కార్ల అమ్మకాలపై పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నట్లు ఫెడరేషనన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ తెలిపింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్లు పాడవుతాయనే అనుమానాలతో చాలా మంది కొనుగోలుదారులు పెట్రోల్ వాహనాలకు దూరంగా ఉంటూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో షోరూమ్లలో పెట్రోల్ కార్ల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ గణాంకాల ప్రకారం.. సాధారణంగా 30 నుండి 33 రోజులు ఉండాల్సిన డీలర్ల ఇన్వెంటరీ కాలపరిమితి, ఇప్పుడు ఏకంగా 60 నుండి 70 రోజులకు పైగా పెరిగింది. జూలై నెలలో హోల్సేల్ సరఫరా ఎక్కువగా ఉన్నా.. రిటైల్ విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద సుమారు 52 వేలకు పైగా అదనపు వాహనాలు నిలిచిపోయాయి.
0 Comments