మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయనను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం అత్తాపూర్ పోలీసుస్టేషన్లో ఉదయ్కృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ లావణ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్కు చెందిన ఉన్నతాధికారులు ఈ విచారణలో పాల్గొంటున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 28న పోలీసులు ఉదయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల కస్టడీ విచారణలో భాగంగా కేసులోని పలు కీలక కోణాలపై అధికారులు దృష్టి సారించారు. సంఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, సంభాషణలు మరియు ఇతర ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించేందుకు పోలీసు బృందం ప్రయత్నిస్తోంది.
0 Comments