Ad Code

రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై విమర్శించడం అర్వింద్‌ మానసిక వైకల్యానికి నిదర్శనం !

హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే బ్రిటన్ పర్యటనకు వెళ్లారని స్పష్టం చేశారు. లండన్‌లోని ప్రముఖ విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలను సందర్శించి అక్కడి ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులకు ఎందుకు కడుపునొప్పి అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎంపీ ధర్మపురి అర్వింద్ అతితెలివి ప్రదర్శిస్తూ, "భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారు" అని పిచ్చి కూతలు కూస్తున్నారని నిప్పులు చెరిగారు. 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ 103 విదేశీ పర్యటనలు చేసి 82 దేశాలు తిరిగారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. "ప్రధాని ఎందుకోసం వెళ్లారు? ఆయన కూడా పనిలేక తిరుగుతున్నారా?" అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్ల కాలంలో కేవలం రెండు సార్లు దావోస్‌కు, ఒకసారి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు మాత్రమే వెళ్లారని, రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తే బీజేపీ నాయకులు ఏడవడం వారి మానసిక వైకల్యానికి నిదర్శనమని విమర్శించారు. "ఏ విధంగానైనా ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తాం" అని ధర్మపురి అర్వింద్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావడం తమకు అలవాటే అని అర్వింద్ నిర్లజ్జగా ఒప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. "అర్వింద్ గుర్తు పెట్టుకో.. తెలంగాణలో మీ ఆటలు సాగవు. ఇక్కడుంది రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం జోలికి వస్తే తోకలు కత్తిరించి పంపిస్తాం.. తాట తీస్తాం" అని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయని, గతంలో ఇలాగే ప్రయత్నించి బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ఎంపీలు బెదిరింపులకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. "ఏ విధంగానైనా అధికారంలోకి వస్తాం" అన్న అర్వింద్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెంటనే జవాబు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu