ఢిల్లీలోని ముకుంద్పూర్ ప్రాంతంలో పత్రాలు లేని బైక్ను సీజ్ చేసినందుకు కక్షకట్టి, పోలీసుల కళ్లల్లో కారం చల్లి, కర్రలు, ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమవగా, మొత్తం ముగ్గురు పోలీసులు ఆసుపత్రి పాలయ్యారు. వాయువ్య ఢిల్లీలోని భల్స్వా డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జనతా విహార్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు దినేష్, రాజేశ్ పెట్రోలింగ్ చేస్తుండగా.. సరైన పత్రాలు లేని ఓ బైక్ను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు తిరిగి తమ డ్యూటీకి రాగానే.. బైక్ యజమాని, అతని కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా రెచ్చిపోయి కళ్లలో కారం చల్లారు. వారిని రక్షించేందుకు వచ్చిన మరో హెడ్ కానిస్టేబుల్ టినుపైనా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో దినేష్ తలకు గాయమైంది. ప్రస్తుతం గాయపడిన ముగ్గురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. స్థానికుల సాయంతో దాడికి పాల్పడిన 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన సునీల్ అలియాస్ పంకజ్ పరారీలో ఉన్నాడు. అతడిపై గతంలోనే డ్రగ్స్ సహా ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆ ప్రాంతంలో అతను రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని 221, 132, 121, 110, 61 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
0 Comments