Ad Code

నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు : ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణలోని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. విస్తృత దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురిని నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ నెల 11న కొండమల్లేపల్లి జేబీ కాలనీలోని తన స్వగృహంలోనే రూపారెడ్డి కత్తిపోట్లకు గురై దారుణంగా హత్యకు గురయ్యారు. నిందితులు హత్య చేసే సమయంలో గ్లౌజులు ధరించడంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు లభించక దర్యాప్తు పోలీసులకు తీవ్ర సవాలుగా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజీలు, ప్రత్యేక నిఘా విభాగం ఆధారంగా సుమారు 80 మందిని విచారించారు. విచారణలో భాగంగా కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులపై అనుమానం రావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన అనంతరం ఇంటి నుంచి సుమారు రూ. 4 లక్షల నగదును నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం నగదు చోరీ కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా? లేదా దీని వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణను పూర్తి చేసి, త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu