భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతేడాది నవంబర్ 2 న చేపట్టిన సీఎంఎస్-03 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. బాహుబలి LVM3-M5 రాకెట్ ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోగం చేపట్టిన దాదాపు 9 నెలల వ్యవధిలోనే బాహుబలి LVM3-M5 రాకెట్ కు చెందిన పై భాగం సీ-25 అప్పర్ స్టేజ్ భూవాతావరణంలోకి వచ్చింది. అంతరిక్షంలో వ్యర్థాలు నిల్వ ఉండకుండా భారత్ అనుసరిస్తున్న నిబంధనలు ఇతర అంతరిక్ష సంస్థలకు నిదర్శనంగా మారుతున్నాయి. LVM3-M5 రాకెట్ కు చెందిన సీ25 అప్పర్ స్టేజీ విభాగం జూలై 30న భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు ఈ మేరకు ఇస్రో స్పష్టం చేసింది. ఉపగ్రహం ప్రయోగించిన 9 నెలల తర్వాత సీ25 విభాగం భూ కక్ష్యలోకి చేరినట్లు వెల్లడించింది. శాటిలైట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సీ 25 అప్పర్ స్టేజ్ పని ముగుస్తుంది. ప్రమాదవశాత్తూ విచ్ఛిన్నమయ్యే అవకాశాన్ని తగ్గించే ప్రక్రియ అయిన పాసివేషన్ ను ఇస్రో చేపట్టి.. దాన్ని 21 డిగ్రీల ఇక్లినేషన్ లో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచింది. అయితే ఈ సీ 25 అప్పర్ స్టేజ్ ను యూఎస్ స్పేస్ కమాండ్ కంట్రోల్ ట్రాక్ చేసింది. అలాగే శ్రీహరికోటలోని మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ కూడా దానిని ట్రాక్ చేసింది. ఈ స్టేజ్ అట్లాంటిక్ మహా సముద్రంపై పడుతుందని అంచనా వేస్తూ అది తిరిగి భూ వాతావరణ కక్ష్యలోకి ప్రవేశించే సమయాన్ని ఇస్రో జూలై 30 న సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు అంచనా వేసింది. సీ 25 అప్పర్ స్టేజ్ భూ వాతావరణంలోకి వేగంగా వస్తున్న క్రమంలో జనరేట్ అయ్యే హీట్ కారణంగా ఈ దశలోనే ఎక్కువ భాగం ధ్వంసం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కేవలం అత్యధిక మెల్టింగ్ పాయింట్ సామర్థ్యం కలిగిన గ్యాస్ సిలిండర్లు, నాజిల్, ట్యాంకులు మాత్రమే మిగిలి ఉంటాయని అంచనా వేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పక్కా ప్రణాళికతో అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే ఆలోచనలో ఈ నిబంధనలు పాటించి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
0 Comments