Ad Code

స్పైస్‌జెట్ విమానంలో చెమటలతో తడిసిముద్దయిన ప్రయాణికులు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానం టేకాఫ్ కాకముందే క్యాబిన్ లోపల భరించలేని వేడి, గాలి ఆడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నారులు, వయోధికులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా నరకయాతన అనుభవించడంతో, ప్రయాణికులు విమానాశ్రయం రన్‌వే సమీపంలోని టార్మాక్‌పై బైఠాయించి నిరసనకు దిగారు. బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విమానం క్యాబిన్ లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరగడం ప్రారంభమైంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు చెమటలతో తడిసిముద్దయ్యారు. వివిధ వయో వర్గాలకు చెందిన ప్రయాణికులు ఉన్న ఆ విమానంలో, ముఖ్యంగా చిన్న పిల్లలు , వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురై ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ, విమానాన్ని టేకాఫ్ కోసం రన్‌వే వైపు తీసుకువెళ్లడం ప్రయాణికులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. క్యాబిన్‌లో వేడి తట్టుకోలేక ప్రయాణికులు విమానం టేకాఫ్‌ను అడ్డుకున్నారు. విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి, విమాన కెప్టెన్ , సిబ్బంది ప్రయాణికులపై కేకలు వేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు నిరసనను తీవ్రతరం చేయడంతో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం ఉన్నట్లు చివరకు నిర్ధారణ అయింది. విమానయాన సంస్థ నిర్లక్ష్యం, ఘోరమైన సేవలు , ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడటంపై తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు విమానం నుంచి కిందకు దిగి ఎయిర్‌పోర్ట్ టార్మాక్‌పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) ఈ ఘటనపై తక్షణమే స్పందించి, స్పైస్‌జెట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు ఎదురవుతుండటం, సేవల నిర్వహణలో వైఫల్యాలు బయటపడుతుండటంపై విమాన ప్రయాణికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu