Ad Code

షేక్ హసీనాను అప్పగించే వరకు ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత పర్యటన సాధ్యం కాకపోవచ్చు : బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర పరారీలో ఉన్న నిందితులను అప్పగించే వరకు తమ ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రతిపాదిత భారత పర్యటన సాధ్యం కాకపోవచ్చని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. ద్వైపాక్షిక పర్యటనపై ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఢిల్లీలో ఆగస్ట్ 5న షేక్ హసీనా పాల్గొన్న ఒక బహిరంగ మీడియా సమావేశం పర్యటన వాతావరణాన్ని దెబ్బతీసిందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్‌కేఎమ్ షాహిదుల్ కరీమ్ పేర్కొన్నారు. అయితే, ఈ పత్రికా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాతో పాటు, రాజకీయ కార్యకర్త షాహిద్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను తక్షణమే అప్పగించాలని బంగ్లాదేశ్ కోరింది. ఉస్మాన్ హాదీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్ పోలీసులు మార్చిలో ఉత్తర 24 పరగణాల జిల్లా సరిహద్దు పట్టణం బొంగావ్ వద్ద అరెస్ట్ చేశారు. తమ విజ్ఞప్తిపై భారత్ నుంచి వచ్చే స్పందన కోసం వేచి చూస్తున్నామని, అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడే ప్రధాని పర్యటనపై స్పష్టత వస్తుందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu