ఇరాన్కు ఆర్థికంగా, వాణిజ్యపరంగా సహాయపడే ఏ దేశానికైనా తీవ్రమైన పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్యను ఆయన "ఎకనామిక్ డి-డే"గా అభివర్ణించారు. ఇరాన్పై చేపట్టిన ఈ చర్యలను సాధారణ ఆంక్షలుగా కాకుండా, ఆ దేశాన్ని ప్రపంచ మార్కెట్ నుండి పూర్తిగా వేరు చేసే ఆర్థిక యుద్ధంగా ట్రంప్ పేర్కొన్నారు. ఏ దేశమైనా తన ఆర్థిక సంస్థలు, విమానాశ్రయాలు, వ్యాపారాల ద్వారా ఇరాన్కు సహాయం అందిస్తే, అమెరికా నుండి ఊహించని నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ చమురు రవాణా, కరెన్సీ మార్పిడి మార్గాలు (Swap Lines), క్యాష్ ట్రాన్స్ఫర్లు, షిప్ రిజిస్ట్రీలు మరియు ఫ్రంట్ కంపెనీలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని మరియు దానిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదని పునరుద్ఘాటించారు. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా నౌకాదళ బ్లాకేడ్ అత్యంత విజయవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు బ్యారెల్కు $350 దాటుతాయనే అంచనాలు ఉన్నప్పటికీ, టెక్సాస్, అలాస్కా, లూసియానాలలో అమెరికా చమురు ఉత్పత్తి పెరగడం వల్ల ప్రస్తుతం బ్యారెల్ $84-$85 ల వద్దే స్థిరంగా ఉందని చెప్పారు. ఇరాన్తో భవిష్యత్తులో మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్న ట్రంప్ ఏ పరిస్థితుల్లోనూ ఆ దేశం అణు ఆయుధాలను మాత్రం సొంతం చేసుకోనివ్వబోమని స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉంటే వాటిని వినియోగించే ప్రమాదం ఉందన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోను ఇరాన్ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఈ అంశంపై స్పందిస్తూ, అమెరికా తమ డిమాండ్లను అంగీకరించే వరకు, ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేసి ఆంక్షలను ఎత్తివేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
0 Comments