హైదరాబాద్ నగరంలో నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాలను చూపించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మైలార్దేవ్పల్లి పోలీసులతో కలిసి పట్టుకున్నారు. కాటేదాన్ లక్ష్మిగూడలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, దానిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసొస్తుందని నమ్మించి భారీ ధరకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అరుదైన గులాబీ రంగు రాయి పేరుతోనూ కొనుగోలుదారులను మోసం చేసేందుకు నిందితులు పథకం వేసినట్లు వెల్లడించారు. 2024లో ఈ ముఠా రూ.10 లక్షలకు నకిలీ పంచలోహ విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం దాన్ని మరింత భారీ ధరకు విక్రయించేందుకు జ్యోతిష్యుడితో కలిసి పక్కా స్కెచ్ వేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో కార్ డ్రైవర్లు, కార్మికుడు, జ్యోతిష్యుడు ఉన్నారు. నిందితుల నుంచి నకిలీ లక్ష్మీదేవి విగ్రహం, పింక్ కలర్ రాయి, ఎర్టిగా కారు, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు రసాయన ద్రావణాల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
0 Comments