Ad Code

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై స్టే ఎత్తివేతకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిధుల దుర్వినియోగం జరుగుతోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కోర్టు స్పష్టం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్‌ పై ఇవాళ కూడా విచారణ సాగింది. ఆగస్టు 19 న ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్​ ను పరిశీలించిన ధర్మాసనం అందులో సరైన వివరాలు లేవని పేర్కొంది. ఉచిత పథకాలకు నిధులు కేటాయించడం మూలంగా పదవీవిరమణ అనంతరం ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా అందటం లేదని.. అందుకే ఫించన్లు, బెనిఫిట్స్ అందక చాలామంది కోర్టును ఆశ్రయిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజల ట్యాక్స్‌ లతో వచ్చే డబ్బును ఉచిత పథకాలకు వాడటం న్యాయమేనా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ లో సరైన వివరాలు లేవని, పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఏఏజీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక ఈ పథకాల చట్టబద్దత, బడ్జెట్ కేటాయింపులపై స్పష్టమైన వివరణ కావాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఆగస్టు 13 న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్. వీ. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది.


Post a Comment

0 Comments

Close Menu