కల్తీ, నాణ్యత లేని నూనెల విక్రయాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో లూజ్గా వంట నూనెను విక్రయించడంపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. ఇకపై దుకాణదారులు బహిరంగంగా విడిగా వంట నూనెను విక్రయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూనె ప్యాకెట్పై దాని మూలం, తయారీ, గడువు తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. లూజ్గా విక్రయించే నూనె ఎక్కడ తయారైంది? ఎప్పుడు తయారైంది? దాని గడువు ఎంత? అనే వివరాలను తెలుసుకోవడం కష్టమవుతోందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు నూనె మూలాన్ని గుర్తించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ట్రేసబిలిటీ ఉండేలా ప్యాక్ చేసిన నూనె విక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'సురక్షిత ఆహారం, సురక్షిత మహారాష్ట్ర' కార్యక్రమంలో తదుపరి ప్రధాన దృష్టి వంట నూనెపై ఉంటుందని తెలిపారు. నూనె తయారీ నుంచి ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్ విక్రయాల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వంట నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగించడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్లలో నూనెను పదేపదే ఉపయోగించే విధానాలపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. అలాగే వంట నూనె ప్యాకేజింగ్కు ఉపయోగించిన టిన్లను నిబంధనలకు విరుద్ధంగా తిరిగి వినియోగించడంపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తయారీదారులు, పంపిణీదారులు, వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత లైసెన్సులు, FSSAI నిబంధనలు పాటించాలని FDA స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుకారాం ముండే హెచ్చరించారు. ఈ నిర్ణయంతో మహారాష్ట్రలో వంట నూనె విక్రయాలు, వినియోగంపై పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది.
0 Comments