రెండు వారాలలో జైలులో లోంగిపోవాలని 'తెహల్కా' మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో గోవా సెషన్స్ కోర్టు 2021లో తేజ్పాల్ను నిర్దోషిగా విముక్తి చేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన బొంబాయి హైకోర్టు గోవా బెంచ్, 2021 సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ తరుణ్ తేజ్పాల్ను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల్లో శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసే ముందు ముద్దాయి తప్పనిసరిగా లొంగిపోయి ‘సరెండర్ సర్టిఫికేట్’ సమర్పించాలి, లేదా లొంగుబాటు నుంచి మినహాయింపు కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలి. గోవా ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేసు తీవ్రతను బట్టి తేజ్పాల్ ముందుగా సరెండర్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే ఆయన అప్పీల్పై విచారణ జరపాలని కోరారు. తరుణ్ తేజ్పాల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, బొంబాయి హైకోర్టు ఇప్పటికే శిక్ష అమలుపై స్టే ఇచ్చిందని, కాబట్టి మళ్లీ లొంగిపోవాలని అనడం సరికాదని పేర్కొన్నారు. అయితే కోర్టు సరెండర్ కావాలని భావిస్తే కస్టడీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండు వారాల్లోగా తేజ్పాల్ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని, ఆ తర్వాతే ఆయన దాఖలు చేసిన అప్పీల్పై తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. పనాజీలోని ఒక హోటల్ ఎలివేటర్ (లిఫ్ట్) లో తనతో పాటు పనిచేసే మహిళా జర్నలిస్ట్పై 2013 నవంబర్ 7, 8 తేదీల్లో తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 2013 నవంబర్ 30న ఆయన అరెస్ట్ అయ్యారు. ఐపీసీ లోని రేప్, లైంగిక వేధింపులు, తీవ్రంగా నిర్బంధించడం వంటి పలు సెక్షన్ల కింద 2017 సెప్టెంబర్ 29న ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. 2021 మే నెలలో గోవా సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపలేకపోయిందని చెబుతూ తేజ్పాల్ను నిర్దోషిగా విడుదల చేసింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా, విచారణ జరిపిన బొంబాయి హైకోర్టు సెషన్స్ కోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి తేజ్పాల్ను దోషిగా తేలుస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తేజ్పాల్ హైకోర్టు తీర్పును సవాల్ చేయగా, మరోవైపు గోవా ప్రభుత్వం తేజ్పాల్కు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను మరింత పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
0 Comments