మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, పురానీ ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రపురలో ఒక కుటుంబం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమైన ఒక యాడ్పై క్లిక్ చేయడంతో, క్షణాల వ్యవధిలోనే దాదాపు 98 వేల రూపాయలను నష్టపోయింది. కేవలం ఒకే ఒక్క క్లిక్తో సైబర్ దొంగలు బాధితుల బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని పూర్తిగా కాజేయడం కలకలం రేపింది. స్థానికుడైన జయ ప్రతాప్ సింగ్ బాథమ్ పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, ఆగస్టు 11వ తేదీన ఆయన భార్య రచన ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా ఒక యాడ్ కనిపించింది. దానిని తాకగానే ఆమె వాడే మోటోరోలా మొబైల్ ఫోన్ పూర్తిగా హ్యాంగ్ అయిపోయి పనిచేయడం ఆగిపోయింది. మొదట్లో దీన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అదే రోజు రాత్రి బ్యాంకు నుంచి ఒక ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన సందేశం రావడంతో అనుమానం వచ్చి ఖాతా నిల్వను పరిశీలించగా, బ్యాలెన్స్ మైనస్లో కనిపించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు ఉదయం బాధితులు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలను పరిశీలించగా అసలు మోసం బయటపడింది. మూడు వేర్వేరు యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.70,000, రూ.20,000, రూ.8,000 చొప్పున మొత్తం 98,000 రూపాయలు వేరే ఖాతాలకు మళ్ళించబడినట్లు గుర్తించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆగస్టు 16న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దర్యాప్తు బాధ్యతలను సైబర్ సెల్కు బదిలీ చేశారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే ఇలాంటి అనుమానాస్పద, హానికరమైన ప్రకటనలు క్షణాల్లో ఫోన్లోకి మాల్వేర్ను చొప్పిస్తాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మన ప్రమేయం లేకుండానే సైబర్ కేటుగాళ్లు యూపీఐ లావాదేవీలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఎవరికీ తెలియని లేదా వింతగా అనిపించే యాడ్స్పై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని, ఒకవేళ మోసానికి గురైతే వెంటనే బ్యాంకు అధికారులను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments