Ad Code

భారత్ - శ్రీలంక రెండో టెస్టు : 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసిన భారత్ : పడిక్కల్ సెంచరీ

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట భారత్‌కు అనుకూలంగా సాగింది. తొలి రోజే భారత్ తన ఆధిక్యాన్ని చాటుకుంది తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ మరోసారి 117 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది పడిక్కల్‌కు వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. పడిక్కల్‌తో పాటు కెప్టెన్ గిల్ కూడా అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ వరుసగా తన రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది . ఆ మ్యాచ్ గాలేలోని గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచి శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించలేదు. కేఎల్ రాహుల్ కేవలం 18 పరుగులకే లాహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో కనిపించినప్పటికీ.. అసిత ఫెర్నాండో అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. యశస్వి 53 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వారు మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అసిత ఫెర్నాండో శుభ్‌మన్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ 108 బంతుల్లో ఆరు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఔటయ్యే సమయానికి, భారత్ స్కోరు 186/3గా ఉంది. శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాహిరు కుమార వేసిన షార్ట్ బంతికి మణికట్టుకు గాయమైంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ తీవ్రమైన నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాల్సి రావడం భారత్ కు ఎదురు దెబ్బగా మారింది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడి 43 పరుగులు చేసి అసిత ఫెర్నాండో బౌలింగ్ లోనే ఔటయ్యాడు.

Post a Comment

0 Comments

Close Menu