Ad Code

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు : ఢిల్లీలో హైఅలర్ట్

గస్టు 15న జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. సుమారు 24 వేల మంది అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి భద్రత పెంచడంలో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వివరాలతో కూడిన పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలకు చెందిన 19 మంది ఉగ్రవాదుల వివరాలతో పోస్టర్లను రూపొందించారు. మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలలో ఈ పోస్టర్లను అందుబాటులో ఉంచారు. వీరి గురించి సమాచారం తెలిస్తే తక్షణమే 112 కంట్రోల్ రూమ్‌కు లేదా పోలీసులకు తెలుపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచి, రివార్డు అందజేస్తామని ప్రకటించారు. ఎర్రకోట పరిసరాల్లో 1,000కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో విశ్లేషణ ద్వారా అనుమానాస్పద కదలికలను రియల్‌టైమ్‌లో పసిగడతారు. ఎర్రకోట ప్రాంతంలో సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించారు. స్వాట్ (SWAT) కమాండోలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. ఆగస్టు 2 నుండి 16 వరకు ఢిల్లీ పరిధిలో డ్రోన్లు, UAVలు, హాట్ ఎయిర్ బెలూన్లు వంటి గగనతల వాహనాలపై పూర్తి నిషేధం విధించారు. పటిష్ట తనిఖీల నేపథ్యంలో ఎర్రకోట సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. గత నవంబర్‌లో జరిగిన కారు పేలుడు ఘటనను దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసులు నగరమంతటా ముమ్మరంగా వాహన తనిఖీలు మరియు గస్తీ నిర్వహిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu