ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాలు బ్రిడ్జి కల్వర్టు పైనుంచి ఒక్కసారిగా కిందపడిపోయాయి. ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కల్వర్టు కిందపడిన వాహనాలు:ఢీకొన్న తీవ్రతకు లారీ, బస్సు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు పైనుంచి కిందపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు లారీ మరియు బస్సు డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు:సమాచారం అందుకున్న పామిడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అతివేగం మరియు తెల్లవారుజామున నిద్రమత్తే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments