Ad Code

పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ సత్తా చాటిన టీఎంసీ : టీఎంసీ 15, బీజేపీ 3, లెఫ్ట్ ఫ్రంట్ 3, కాంగ్రెస్ 2

శ్చిమ బెంగాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో మమత పార్టీ టీఎంసీ సత్తా చాటుకుంది. భారీ తేడాతో అధికార బీజేపీని చిత్తు చేసి విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ఇంకా మమత పార్టీ టీఎంసీ బలంగానే ఉందని నిరూపితమైంది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ సత్తా చాటుకుంది. పార్టీ నిలబెట్టిన 15 మంది అభ్యర్ధులు ఇందులో ఘన విజయం సాధించారు. మొత్తం 23 సీట్లకు జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మమత పార్టీ ఏకంగా 15 సీట్లు గెల్చుకుంది. ఇప్పటికే ఆయా సీట్లలో టీఎంసీ లాయర్లే ఉన్నారు. అయితే మరోసారి ఈ స్ధానాల్ని మమత ప్రస్తుత పరిస్ధితుల్లో నిలబెట్టుకోవడం సంచలనం రేపుతోంది. అంతే కాదు బార్ కౌన్సిల్ పైనా మమత పట్టును ఈ విజయం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం అధికారంలోకి ఉన్నప్పటికీ, మమత పార్టీ టీఎంసీ నుంచి వరుస ఫిరాయింపులతో పైచేయి సాధిస్తున్నప్పటికీ సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైంది. గతంలోనూ బీజేపీకి ఇక్కడ 3 సీట్లే ఉన్నాయి. ఇది న్యాయవాద వర్గాల్లో టీఎంసీ ప్రభావం ఇంకా కొనసాగుతోందని సూచిస్తోంది. ఎన్నికలు జరిగిన 23 స్థానాలకు గాను, టీఎంసీ 15 గెలుచుకోగా, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మహిళలకు ఐదు స్థానాలు రిజర్వ్ చేయగా, వాటిలో టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. టీఎంసీ గెల్చిన అభ్యర్ధులంతా మమతా బెనర్జీ స్వయంగా ఎంపిక చేసిన వారు కావడం మరో విశేషం.

Post a Comment

0 Comments

Close Menu