గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానం గాల్లో ఉండగా విమానం కిటికీ పగిలిపోయి ఓ ప్రయాణికుడు సగం బయటకొచ్చేశాడు. ర్యాన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో ఘటన చోటు చేసుకుంది. అతను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో తోటి ప్రయాణికులు సకాలంలో స్పందించి అతడిని లోపలికి లాగినట్లు ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపారు. బాధితుడు సెర్బియాకు చెందిన పర్యాటకుడు. అతను గ్రీస్లోని థెస్సలొనికి నుండి జర్మనీలోని మెమ్మింగెన్కు ప్రయాణిస్తున్నాడు. విమానం వెలుపలికి లాగినప్పుడు ఈ క్రమంలో చర్మం గీసుకుపోయి గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. టైరు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో తాము నిద్ర లేచామని.. ఆ వెంటనే కేకలు వినిపించాయని.. అప్పటికే సదరు ప్రయాణికుడి తల, భుజాలు కిటికీ వెలుపల ఉన్నాయని తోటి ప్రయాణికులు చెప్పారు. విమానంలో ప్రెజర్ తగ్గిపోయిందని మాకు వెంటనే అర్థమైంది. అంతటా కేకలు వినిపించాయి. ఎవరో పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచారేమోనని తాను అనుకున్నానని మరో మహిళా ప్రయాణికురాలు పేర్కొన్నారు. ఆక్సిజన్ మాస్క్లు కిందకు పడ్డాయని.. ఒక రకమైన ఘాటైన వాసన వచ్చిందని, ఓ ప్రయాణికుడి తల, భుజాలు కిటికీ వెలుపల ఉన్నాయి. అదృష్టవశాత్తూ, అతను తన సీట్ బెల్ట్ తీసివేయకపోవడంతో బతికిపోయాడు. ఆ వ్యక్తికి సమీపంలో ఉన్న ఇతర ప్రయాణికులు అతడిని తిరిగి లోపలికి లాగడానికి సహాయం చేశారని ఆమె తెలిపారు. గ్రీక్ మీడియా కథనాల ప్రకారం విమాన ఇంజన్ల నుండి ఊడిపోయిన చిన్న ముక్క బలంగా తాకడం వల్లే కిటికీ పగిలిపోయింది. ఈ ప్రమాదం సరిగ్గా ఉత్తర మాసిడోనియా గగనతలంలో ఉన్నప్పుడు జరిగింది. ర్యాన్ ఎయిర్ సంస్థ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక విండో ఊడిపోవడంతో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తిరిగి థెస్సలొనికికి మళ్ళించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను తిరిగి టెర్మినల్కు చేర్చాము" అని తెలిపింది.
0 Comments