ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ గ్రామీణ మండల పరిధిలో కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత, తన ఇద్దరు కన్నబిడ్డలను చంపి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విఠంరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘోరకలికి సంబంధించిన వివరాలను స్థానికులు, పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి (24)కి సునీల్రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి తేజేష్రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీల్రెడ్డి పాల వ్యాను డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త సునీల్రెడ్డి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, కుటుంబ పోషణను పూర్తిగా గాలికొదిలేసి భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజువారీ లాగే రాత్రి భర్త విధులకు వెళ్లిన తర్వాత.. ఇంట్లో ఒంటరిగా ఉన్న భారతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. నిద్రపోతున్న తన ఇద్దరు అక్కున చేర్చుకోవాల్సిన కుమారులకు బలవంతంగా విషం ఇచ్చి హతమార్చింది. ఆపై ఇద్దరు పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం.. ఆమె కూడా ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం విషయం వెలుగుచూడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న వినుకొండ రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments