తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్ జిల్లాలోని ఊర్కొండపేటలో పర్యటించారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన సొంత గడ్డపై సీఎం పర్యటన అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది. పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పలు ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ఆయన అధికారికంగా శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాగర్కర్నూల్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మిడ్జిల్ జడ్పీటీసీగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, జడ్పీటీసీగా ఘన విజయం సాధించడమే కాకుండా.. నేడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని ఈ సందర్భంగా జిల్లా ప్రజలు కొనియాడారు. జడ్పీటీసీగా తన తొలి విజయానికి వెన్నుముకగా నిలిచిన నాటి పాత అనుచరులను, జిల్లా నేతలను, శ్రేయోభిలాషులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారందరి కోసం ఏర్పాటు చేసిన 'ఆత్మీయ సమ్మేళనం'లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత తన పాత రాజకీయ మిత్రులను చూసిన సీఎం ప్రోటోకాల్ పక్కనబెట్టి వారిని ఆత్మీయంగా కౌగిలించుకుని పలకరించారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తామంతా కలిసి చేసిన రాజకీయ పోరాటాలు, క్షేత్రస్థాయి అనుభవాల జ్ఞాపకాలను మిత్రులతో కలిసి సీఎం నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న పలువురు పాత తరం నేతలు రేవంత్రెడ్డితో తమకున్న పాత అనుబంధాన్ని, ఆయనలోని నాయకత్వ లక్షణాలను వేదికపై గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఊర్కొండపేట పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
0 Comments