తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న శివ శంకర్ అనే విద్యార్థి తాను కిరాయికి ఉంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివ శంకర్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి నర్సాపూర్లో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తన స్నేహితులను కళాశాలకు వెళ్లాలని చెప్పిన శివ శంకర్, తాను మాత్రం గదిలోనే ఉండిపోయాడు. అనంతరం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్నేహితులు తిరిగి గదికి వచ్చి తలుపు తీయగా, శివ శంకర్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులను విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
0 Comments