Ad Code

హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు : తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం

హైదరాబాద్ లోని  హయత్‌నగర్ పరిధిలోని ఒక వివాదాస్పద స్థలానికి సంబంధించి న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ‘స్టేటస్ కో’ ఆర్డర్ జారీ చేసినప్పటికీ, హైడ్రా అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ స్థలంలోకి చొరబడటమే కాకుండా, అక్కడ ఉన్న నిర్మాణాలను అక్రమంగా కూల్చివేసి, అది పార్క్ స్థలమంటూ హైడ్రా బోర్డును ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్టపరమైన నిబంధనలను, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమ స్థలంలో హైడ్రా బలవంతపు కూల్చివేతలకు పాల్పడటంపై బాధితుడు/పిటిషనర్ అత్యవసరంగా హైకోర్టులో ‘లంచ్ మోషన్’ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ అధికారులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. న్యాయపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ ఆస్తుల వివాదాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడంపై మండిపడింది. కోర్టు పరిధిలో ఉన్న కేసులను విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించిన హైకోర్టు, ఈ కూల్చివేత వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu