134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించి గతంలో జారీ అయిన మధ్యంతర నిషేధాజ్ఞలను ఎత్తివేయాలంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు అలాగే కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదంలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సారేగామా’ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ 134 చిత్రాలలోని పాటలపై పూర్తి కాపీరైట్ హక్కులు చట్టబద్ధంగా తమకే దక్కాయని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే, ఆయా సినిమాల్లోని అద్భుతమైన పాటలను స్వరపరిచింది తానేనని.. అలాంటప్పుడు ఆ బాణీలపై మరెవరికో హక్కులు ఎలా ఉంటాయని ఇళయరాజా గట్టిగా వాదిస్తున్నారు. తన సృజనాత్మకతకు దక్కిన హక్కులు తనకే చెందాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇరు పక్షాల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన న్యాయపోరాటం సాగుతోంది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఇళయరాజా అప్పీల్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుత దశలో ఆ ఆదేశాలను మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ కాపీరైట్ వివాదంపై పూర్తిస్థాయి విచారణ పూర్తయి, తుది తీర్పు వచ్చేంత వరకు ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
0 Comments