Ad Code

ఏఐ ఏజెంట్లు ఊహించినంత వేగంగా అభివృద్ధి చెందలేదు : అసహనం వ్యక్తం చేసిన మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్

మెటా కంపెనీలో చేపట్టిన సమగ్ర పునర్వ్యవస్థీకరణ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, కంపెనీ ఏఐ ఏజెంట్లు ఊహించినంత వేగంగా అభివృద్ధి చెందలేదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మార్పుల సమయం విషయంలో ఉన్నతాధికారులు సరిగా అంచనా వేయలేదని అన్నారు. మెటా పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది మెటా లో ప్రపంచవ్యాప్త ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతం. 2026 నాటికి 145 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసిన మెటా భారీ ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు నిధులు సమకూర్చడమే ఈ చర్యల ఉద్దేశమని తెలుస్తోంది. గత కనీసం నాలుగు నెలలుగా ఏజెంటిక్ అభివృద్ధి గమనం తాము ఊహించిన విధంగా వేగవంతం కాలేదని జుకర్‌బర్గ్ అంగీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంథ్రోపిక్ వారి క్లాడ్ కోడ్ వంటి సాధనాలపై అధికారులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఏఐ ఏజెంట్లపై కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇంకా సరైన ఫలితాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇదే విషయమై మెటా సీటీవో ఆండ్రూ బోస్వర్త్ కూడా స్పందించారు. తమ కొత్త అప్లైడ్ ఏఐ విభాగాన్ని ప్రారంభించడంలో కంపెనీ అత్యంత ఘోరమైన విఫలమైందని ఒప్పుకున్నారు. ఈ ఏడాది మార్చిలో 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లతో ఈ యూనిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెటా జెనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేస్తే సరైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. సంస్థ తన దార్శనికతను స్పష్టంగా వివరించడంలో విఫలమవడం ద్వారా విశ్వాసాన్ని దెబ్బతీసిందని బోస్వర్త్ అన్నారు. మెరుగైన కమ్యూనికేషన్, కెరీర్ వృద్ధి అవకాశాలు, ఆఫీస్ సౌకర్యాలను కూడా మెరుగుపరచడం ద్వారా మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. తాజాగా మెటా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మేనేజర్లు తమ కింద పనిచేసే వారి సంఖ్యను 20కి పరిమితం చేసింది. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడానికి మెటా సంస్థ మైక్రోకిచెన్‌లు, ప్రయాణ బడ్జెట్‌లు, సామాజిక కార్యక్రమాలలో పెట్టుబడి పెడుతుందని సీటీఓ వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu