Ad Code

మత్స్యకారులకు సముద్రపు వేట నిషేధ కాల భృతి విడుదల

ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల సేవలో పథకం క్రింద మత్స్యకారులకు సముద్రపు వేట నిషేధ కాల భృతి మొత్తాలను లబ్దిదారులకు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మరో 5,910 మంది మత్స్యకారుల ఖాతాలలో రూ. 20 వేల చొప్పున మొత్తం రూ.11.82 కోట్లు జమ చేయబడ్డాయి. ఈ సంవత్సరం 2026-27 మొదటి విడతలో ఇప్పటికే 1,28,388 మత్స్యకార కుటుంబాలకు రూ. 256.77 కోట్లు అందజేశారు. తాజా విడుదలతో కలిపి మొత్తం 1,34,298 కుటుంబాలకు 268.59 కోట్ల రూపాయల పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ముందు విడతలో మిగిలిన లబ్దిదారులకు ఇప్పుడు సాయం అందించటం జరుగుతుంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళలేని నిషేధ సమయంలో వారి జీవనోపాధి కోసం ఈ నిధులను అందిస్తారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతుంది. దాదాపు రెండు నెలల పాటు వృత్తిపరమైన ఆదాయం లేక మత్స్యకార కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వారికి ఆర్ధిక సాయం అందించి మత్స్యకార కుటుంబాలకు బాసటగా నిలవాలని భావించిన ప్రభుత్వం ఈ పథకం ద్వారా 20 వేల రూపాయల ఆర్ధిక భరోసా అందిస్తుంది. వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. మత్యకారుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.ఇప్పటికే నెల్లూరు జిల్లా తుమ్మలపెంట లో సీఎం చంద్రబాబు మత్యకారులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu