బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పోటీ చేయబోతున్నారు. జన సూరాజ్ పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ప్రశాంత్ కిశోర్ను బంకీపూర్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి ప్రకటించారు. గత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన జన సూరాజ్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారనుంది. ఇదిలావుండగా ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై జన్ శక్తి జనతా దళ్ పార్టీని పెట్టుకున్న తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం పాట్నాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త వీణా మాన్విని ఇక్కడి నుండి బరిలోకి దించారు. దశాబ్దాలుగా బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ స్థానంలో తాము ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇస్తామని తేజ్ ప్రతాప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నేత నితిన్ నబీన్ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ ఇక్కడి నుండి ఐదోసారి గెలుపొందడమే కాకుండా, తన సమీప ఆర్జేడీ అభ్యర్థిపై దాదాపు 50,000 ఓట్ల భారీ మెజారిటీని సాధించారు. ఇప్పటివరకు ఈ స్థానానికి బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ అజయ్ అలోక్, నీల్ రతన్ ఘోష్ వంటి ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జూలై 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్లు దాఖలు చేయడానికి జూలై 13 ఆఖరి తేదీగా నిర్ణయించారు. జూలై 30న పోలింగ్ నిర్వహించి ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఉపఎన్నికలో పూర్తి స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
0 Comments