బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఇస్రో కేంద్రానికి ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. భద్రతా దళాలు, పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల అనంతరం ఇదొక నకిలీ మెయిల్ అని తేలడంతో ఇస్రో అధికారులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కార్యాలయానికి ఈ హెచ్చరిక ఈ-మెయిల్ అందినట్లు సమాచారం. మెయిల్ చూసిన వెంటనే అప్రమత్తమైన అంతర్గత భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఇస్రో ప్రాంగణానికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా కార్యాలయంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భవనం నలుమూలలా క్షుణ్ణంగా శోధించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు సైబర్ క్రైమ్ బృందం రంగంలోకి దిగింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయంలో తనిఖీలు ముగియడంతో, శాస్త్రవేత్తలు, సిబ్బంది తమ విధుల్లో యథావిధిగా చేరారు. కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి.
0 Comments