ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్వేపైకి రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ , ఎయిర్ ఇండియా పైలట్ అప్రమత్తతతో వ్యవహరించడంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో: సిలిగుడి నుంచి ముంబైకి వచ్చిన ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’ విమానం ఎయిర్పోర్ట్లోని ఒక రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రన్వే ఖాళీ చేయకముందే.. అదే రన్వే నుంచి ఢిల్లీకి టేకాఫ్ అవ్వడానికి ‘ఎయిర్ ఇండియా’ విమానం ఎదురుగా దూసుకొచ్చింది. కొన్ని అడుగుల దూరంలో బ్రేకులు: ఒకే రన్వేపై రెండు విమానాలు ముఖాముఖిగా రావడాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే ఎయిర్ ఇండియా పైలట్ను అత్యవసరంగా హెచ్చరించారు. పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపివేయడంతో.. రెండు విమానాలు కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయాయి. ప్రమాదం తప్పిన అనంతరం విమానాశ్రయ సిబ్బంది రెండు విమానాల్లోని ప్రయాణికులను ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా కిందకు దించారు. ఎయిర్ ఇండియా విమానానికి అవసరమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించడానికి దానిని బేస్కు తరలించారు. ఈ ఊహించని పరిణామంతో ఆందోళనకు గురైన ప్రయాణికులను ఢిల్లీ తరలించేందుకు ఎయిర్లైన్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రన్వే నిర్వహణలో జరిగిన ఈ తీవ్రమైన లోపంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. ఒకే సమయంలో ఒకే రన్వేపైకి ల్యాండింగ్, టేకాఫ్లకు అనుమతులు ఎలా వచ్చాయనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
0 Comments