మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబీవలి ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో మహిళా డాక్టర్, ఇతర వైద్య సిబ్బందిపై అధికార శివసేన (షిండే వర్గం) లీడర్, స్థానిక కార్పొరేటర్ రమేశ్ మాత్రే తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవనే కారణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్పొరేటర్, అక్కడ వీరంగం సృష్టించారు. కనీస మానవత్వం లేకుండా తన అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి, విధుల్లో ఉన్న హాస్పిటల్ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపిస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడి అంతటితో ఆగకుండా, అక్కడ విధుల్లో ఉన్న మహిళా గైనకాలజిస్టుపై కూడా కార్పొరేటర్ రమేశ్ మాత్రే చేయి చేసుకోవడం గమనార్హం. ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే వైద్యులపై, అదీ ఒక మహిళా డాక్టర్పై ఇలాంటి అనాగరిక దాడి జరగడంపై వైద్య వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సదరు కార్పొరేటర్, అతని అనుచరులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రోగులకు ప్రాణాలు పోసే వైద్యులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని నెటిజన్లు, డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
0 Comments