Ad Code

అరెస్ట్ చేసినా, ఒకవేళ చంపేసినా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా !

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేసినా, ఒకవేళ చంపేసినా తాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు నిరసనల కారణంగా అప్పుడు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవిని వదులుకుని దేశం బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి షేక్ హసీనా భారతదేశంలో ప్రవాసంలో నివసిస్తున్నారు. అయితే రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం... షేక్ హసీనా, పలువురు అవామీ లీగ్ పార్టీ నాయకులు ఈ ఏడాది డిసెంబర్ నెలలో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని యోచిస్తున్నారు. తాను స్వచ్ఛందంగా కోర్టుల ముందు లొంగిపోయి, తనపై ఉన్న చట్టపరమైన విచారణను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు షేక్ హసీనా చెప్పారు. తాను తిరిగి స్వదేశానికి వెళ్లాలనే ఆలోచనల గురించి బంగ్లాదేశ్‌లోని అధికారులతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని హసీనా తెలిపారు. ''నేను తిరిగి వెళ్లినప్పుడు వారు నన్ను అరెస్టు చేయవచ్చు... వారు నన్ను చంపవచ్చు కూడా. అయినా నేను వెళ్లాలి'' అని షేక్ హసీనా అన్నట్లు వార్తలు వచ్చాయి. తన పార్టీ అవామీ లీగ్ సభ్యులు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని... తాను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తే తన మాతృభూమిలోనే మరణించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ''నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. మరణం సంభవిస్తే... నా తల్లిదండ్రులను ఖననం చేసిన, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే అది సంభవించాలని కోరుకుంటున్నాను'' అని షేక్ హసీనా అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu