Ad Code

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపు : ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి రాసిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్లలో ఒకటైన గుడిమల్కాపూర్ కూరగాయలు, పూల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా పరిధిలోని అజీజ్ నగర్‌కు తరలించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గళమెత్తారు. ఈ ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలంటూ ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ క్యాబినెట్ ఇటీవల నగర శివార్లలో మౌలిక వసతుల ఆధునికీకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ పరిధిలో దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడరన్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, శివారు ప్రాంతాలను డెవలప్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను అడ్డం పెట్టుకుని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలాంటి బలమైన కారణం లేకుండా, మార్కెట్ యాక్ట్ 1966 నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత మార్కెట్‌ను అజీజ్ నగర్‌కు మార్చాలని చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. ఈ తరలింపు నిర్ణయం అమల్లోకి వస్తే దాదాపు 10,000 కుటుంబాల జీవనోపాధి రోడ్డున పడుతుందని మార్కెట్ వ్యాపారులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దక్షిణ , పశ్చిమ హైదరాబాద్ జిల్లాల ప్రజల, చిరువ్యాపారుల అవసరాలను తీర్చడంలో గుడిమల్కాపూర్ మార్కెట్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. నగర నడిబొడ్డున, మెహదీపట్నం పరిసరాల్లో అందుబాటులో ఉన్న ఈ మార్కెట్‌ను దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజీజ్ నగర్‌కు తరలిస్తే అటు రవాణా ఖర్చులు పెరిగి వినియోగదారులపై భారం పడటమే కాకుండా, ఇన్నేళ్లుగా ఇక్కడే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది హమాలీలు, రైతులు, పూల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఎంపీ ఓవైసీ స్పష్టం చేశారు. ఈ మార్కెట్‌కు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1991వ సంవత్సరంలో కార్వాన్ పరిధిలోని సబ్జీ మండి నుంచి ఈ మార్కెట్‌ను గుడిమల్కాపూర్ కు తరలించారు. అప్పటి నుండి ఇది పశ్చిమ, పాతనగర పరిధిలోని ప్రజల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారింది. ఓవైసీ మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. గత రెండేళ్ల కాలంలో సౌత్, వెస్ట్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలించారని, ఇది ఆయా ప్రాంతాల ప్రజలకు జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పుడు జీవనోపాధిని దెబ్బతీసేలా ఈ మార్కెట్‌ను కూడా తరలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రతిపాదనను ఇక్కడితోనే ఆపేయాలని చేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu