మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, MP-09-CC-6414 నంబర్ గల కారు ప్రమాదవశాత్తు రహదారి నుంచి జారి నేరుగా చెరువులో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో నీటిలోనే చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రవి ఠాకూర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో ఎంతో శ్రమించి కారును చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం కారులో చిక్కుకున్న వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ఐదుగురు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో ప్రమాదం జరిగిన సమయంలో కారు తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిని రక్షించేందుకు కిటికీలను పగులగొట్టినప్పటికీ అప్పటికే ఆలస్యమైందని వెల్లడించారు. మృతుల జేబుల్లో లభించిన పత్రాల ఆధారంగా వారి వివరాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు అర్నియా ఖుర్ద్, అవంతిపూర్ బరోడియా, మోహన్ బరోడియా, హతాయ్ ఖేడా గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు వచ్చి గుర్తింపు నిర్ధారించిన తర్వాతే అధికారిక ప్రకటన చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
0 Comments