ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగత అభిప్రాయమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ కామెంట్స్ వాస్తవాలను ప్రతిబింబించట్లేదని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టులో తొలి దశ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక 2030 కల్లా జపాన్కు చెందిన ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లు సరఫరా అవుతాయని ప్రభుత్వ వర్గాలు గతంలో పేర్కొన్నాయి. షిన్కాన్సెన్ సాంకేతికతతో ప్లాన్ చేసిన ఈ రైలు ప్రాజెక్టు ముందు అనుకున్న దానికంటే భిన్నంగా ఉందని జపాన్కు చెందిన ఒక ఇంజినీర్ ఇటీవల స్థానిక పత్రికలో ఒక వ్యాసం రాశారు. దీనిపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ స్పందిస్తూ ఓ భారతీయ మంత్రి, అధికారులు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. స్వీయ ప్రయెజనాలకే పెద్ద పీట వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ జపాన్కు దక్కలేదని అన్నారు.
0 Comments