తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈహెచ్ఎస్ అమలుతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు పొందే అవకాశం కలగనుంది. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు. హెల్త్ కార్డుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
0 Comments