Ad Code

బైక్ కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు

తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేటలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రామాయంపేటకు చెందిన సాయమ్మ (65) అనే వృద్ధురాలు ఈ నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటు రావడం వల్లే ఆమె చనిపోయిందని మనవడు విశాల్ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, తల్లి హఠాన్మరణంపై కొడుకు శ్యామ్‌కు తీవ్ర అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడు విశాల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు ఘోరం వెలుగుచూసింది. విశాల్‌కు కొత్త బైక్ కొనాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం డబ్బులు లేకపోవడంతో అమ్మమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేశాడు. ఆ నగలు తనకు ఇవ్వాలని అమ్మమ్మను అడగగా ఆమె నిరాకరించింది. ఎలాగైనా ఆ నగలను కాజేయాలని భావించిన విశాల్, మెడికల్ షాప్‌కు వెళ్లి కొన్ని నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. అమ్మమ్మ నిత్యం తాగే కల్లులో ఆ నిద్రమాత్రలను కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి సాయమ్మ ముఖంపై దిండు పెట్టి, ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయిందని నాటకమాడాడు. పోలీసుల విచారణలో నిందితుడు విశాల్ తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి తానే ఈ హత్య చేసినట్లు తప్పు ఒప్పుకున్నాడు. వృద్ధురాలి శరీరంపై ఉన్న బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu