తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు విడుదల చేయడం, రెండో దశ విస్తరణకు పూర్తి స్థాయిలో అనుమతులు, అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. మొన్నటివరకూ ఉప్పు నిప్పులా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేసుకుని, బహిరంగ లేఖలు రాసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరిద్దరూ కలిసి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో నిన్నటి నుంచి సమావేశం అవుతున్నారు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. బాపూఘాట్ వద్ద ప్రాజెక్టుకు రక్షణ భూములు కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టుకు సంబంధించి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు కూడా మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం వారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కోరనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య, రసాయనాలు- ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచాలని విజ్ఞప్తి చేయనున్నారు.
0 Comments