భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనికి పర్యాటక శోభ కల్పిస్తామని అన్నారు. సోమవారం ఉదయం భువనగిరి ఖిల్లా పైకి రోప్ వే నిర్మించే స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోర్ట్ రిస్టోరేషన్ చేసి చరిత్ర తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. గంటకు మూడు వందల మంది ప్రయాణికులు ఖిల్లా పైకి వెళ్లేలా రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట, భువనగిరి ఖిల్లా, కొలనుపాక సోమేశ్వర ఆలయం, స్వర్ణగిరి కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన టూరిజం శాఖను దేశంలో నంబర్ వన్గా గుర్తింపు తీసుకొస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెలకు రెండు రోజులైనా టూరిజంకు సమయం కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యాటక స్థలాలకు వెళ్తే ప్రజల ఆలోచనా విధానం మారుతుందని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
0 Comments